మంగళవారం హైదరాబాద్లో జరిగిన మోడి సభలో తనతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ను చంద్రబాబునాయుడు నిన్న స్వయంగా అతని కార్యాలయానికి వెళ్ళి మరీ కలుసుకోవటం తెలుగుదేశంపార్టీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. తెలుగుదేశం శ్రేణులలోని ఒక వర్గానికి, నందమూరి కుటుంబంలోని హరికృష్ణ వర్గానికి ఇది జీర్ణించుకోలేని పరిణామమని చెప్పొచ్చు.
మొదటివర్గం కోణంచూస్తే, తెలుగుదేశంలో కోస్తాలోని శ్రేణులలో ఒక సామాజిక వర్గం చంద్రబాబు-పవన్ భేటీ వ్యవహారంపై లోలోపల రగిలిపోతోంది. ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలలోని టీడీపీ శ్రేణులు తల కొట్టేసినట్లయిందని భావిస్తున్నారు. దీనికి మూలాలు ఈనాటివికావు. తెలుగుదేశాన్ని తమ సొంతసంస్థగా పరిగణించే కమ్మ సామాజికవర్గానికీ, పవన్ కళ్యాణ్ సామాజికవర్గమైన కాపులకు కోస్తాలో చిరకాలంగా బద్ధవైరమున్న సంగతి తెలిసిందే. ఊళ్ళలో ఈ రెండు సామాజికవర్గాలకు చెందిన సినీ అభిమానులుకూడా తమ తమ వర్గాలకు చెందిన నందమూరి, మెగా హీరోలకు 'బై డిఫాల్ట్' అభిమానులుగా మారిపోతుంటారు. ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్వద్దకే స్వయంగా వెళ్ళటమేకాక, ఒక పెద్దనేతను కలుసుకున్నపుడు చెప్పినట్లుగా 'మర్యాదపూర్వకంగా కలుసుకున్నాను' అనిచెప్పటం, కోస్తాలోని ఆయన వర్గంవారు భరించలేకపోతున్నారు. మరోవైపు తనవద్దకు వచ్చిన చంద్రబాబువద్ద పవన్ కళ్యాణ్ హావభావాలు, బాడీ లాంగ్వేజ్ లెక్కలేనట్లుగా ఉండటం వారికి పుండుమీద కారం రాసినట్లుంది.
ఇక రెండోవర్గం కోణంచూస్తే, హరికృష్ణ, ఆయన కుమారుడు మినీ ఎన్టీఆర్కుకూడా ఇది జీర్ణించుకోలేని పరిణామమేనని చెప్పొచ్చు. హిందూపూర్ టికెట్ నిరాకరించబడటంతో హరికృష్ణ, ఆయన కుమారుడు లోలోపల రగిలిపోతున్న విషయం తెలిసిందే. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ను ప్రచారానికి బొట్టుపెట్టి పిలవాల్సిన అవసరంలేదంటూ బాలయ్య, లోకేష్ ప్రకటనలు ఇచ్చిన సంగతికూడా విదితమే(పైపెచ్చు, జూనియర్ ఎన్టీఆర్కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ లేరని, ఉన్నదంతా నందమూరి ఫ్యాన్సేననికూడా బాలయ్య కుండబద్దలు కొట్టారు). కాగా, ఇంట్లోనే ఉన్న స్టార్ - ఎన్టీఆర్ను పట్టించుకోని చంద్రబాబు, పవన్ కళ్యాణ్వద్దకు వెళ్ళి బ్రతిమలాడటం హరికృష్ణ అండ్ సన్స్ అవమానాలను రెట్టింపు చేసినట్లయిందని చెప్పొచ్చు.
ఏది ఏమైనా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుగానీ, లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణగానీ తమ మాటల్లో పదే పదే పవన్ కళ్యాణ్ను ప్రస్తావించటానికి, అతని మద్దతుకోసం ప్రయత్నించటానికి కారణం అతనిమీద ప్రేమకాదని, యూత్లోనూ, అతని సామాజికవర్గంలోనూ ఉన్న ఫాలోయింగేనన్నది తెలిసిన విషయమే. దానికితోడు జూనియర్ ఎన్టీఆర్ లేని లోటును పవన్ద్వారా అధిగమించాలని చంద్రబాబు ప్రయాస పడుతున్నారు. తన మిత్రుడు పొట్లూరి వరప్రసాద్కు విజయవాడ టికెట్ ఇవ్వలేదని చంద్రబాబుపై గుర్రుగా ఉన్న పవన్, మొత్తానికి నిన్నటిభేటీ తర్వాత మెత్తబడ్డట్టే ఉన్నారు. రేపటినుంచి టీడీపీ, బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఇవాళ ప్రకటన విడుదలచేశారు. పవన్ మద్దతువలన ఫలితాలు గణనీయంగా మారతాయని చెప్పలేముగానీ, తెలుగుదేశానికి ఎంతోకొంత లబ్దికలుగుతుందనిమాత్రం చెప్పొచ్చు.
Comments
Post a Comment