Skip to main content

పవన్‌కై చంద్రబాబు వెంపర్లాటను ఆ రెండు వర్గాలూ జీర్ణించుకోగలవా!



మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన మోడి సభలో తనతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబునాయుడు నిన్న స్వయంగా అతని కార్యాలయానికి వెళ్ళి మరీ కలుసుకోవటం తెలుగుదేశంపార్టీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. తెలుగుదేశం శ్రేణులలోని ఒక వర్గానికి, నందమూరి కుటుంబంలోని హరికృష్ణ వర్గానికి ఇది జీర్ణించుకోలేని పరిణామమని చెప్పొచ్చు.

మొదటివర్గం కోణంచూస్తే, తెలుగుదేశంలో కోస్తాలోని శ్రేణులలో ఒక సామాజిక వర్గం చంద్రబాబు-పవన్ భేటీ వ్యవహారంపై లోలోపల రగిలిపోతోంది. ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలలోని టీడీపీ శ్రేణులు తల కొట్టేసినట్లయిందని భావిస్తున్నారు. దీనికి మూలాలు ఈనాటివికావు. తెలుగుదేశాన్ని తమ సొంతసంస్థగా పరిగణించే కమ్మ సామాజికవర్గానికీ, పవన్ కళ్యాణ్ సామాజికవర్గమైన కాపులకు కోస్తాలో చిరకాలంగా బద్ధవైరమున్న సంగతి తెలిసిందే. ఊళ్ళలో ఈ రెండు సామాజికవర్గాలకు చెందిన సినీ అభిమానులుకూడా తమ తమ వర్గాలకు చెందిన నందమూరి, మెగా హీరోలకు 'బై డిఫాల్ట్' అభిమానులుగా మారిపోతుంటారు. ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్‌వద్దకే స్వయంగా వెళ్ళటమేకాక, ఒక పెద్దనేతను కలుసుకున్నపుడు చెప్పినట్లుగా 'మర్యాదపూర్వకంగా కలుసుకున్నాను' అనిచెప్పటం,  కోస్తాలోని ఆయన వర్గంవారు భరించలేకపోతున్నారు. మరోవైపు తనవద్దకు వచ్చిన చంద్రబాబువద్ద పవన్ కళ్యాణ్ హావభావాలు, బాడీ లాంగ్వేజ్ లెక్కలేనట్లుగా ఉండటం వారికి పుండుమీద కారం రాసినట్లుంది.

ఇక రెండోవర్గం కోణంచూస్తే, హరికృష్ణ, ఆయన కుమారుడు మినీ ఎన్‌టీఆర్‌కుకూడా ఇది జీర్ణించుకోలేని పరిణామమేనని చెప్పొచ్చు. హిందూపూర్ టికెట్ నిరాకరించబడటంతో హరికృష్ణ, ఆయన కుమారుడు లోలోపల రగిలిపోతున్న విషయం తెలిసిందే. మరోవైపు జూనియర్ ఎన్‌టీఆర్‌ను ప్రచారానికి బొట్టుపెట్టి పిలవాల్సిన అవసరంలేదంటూ బాలయ్య, లోకేష్ ప్రకటనలు ఇచ్చిన సంగతికూడా విదితమే(పైపెచ్చు, జూనియర్ ఎన్‌టీఆర్‌కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ లేరని, ఉన్నదంతా నందమూరి ఫ్యాన్సేననికూడా బాలయ్య కుండబద్దలు కొట్టారు). కాగా, ఇంట్లోనే ఉన్న స్టార్ - ఎన్టీఆర్‌ను పట్టించుకోని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌వద్దకు వెళ్ళి బ్రతిమలాడటం హరికృష్ణ అండ్ సన్స్‌ అవమానాలను రెట్టింపు చేసినట్లయిందని చెప్పొచ్చు.

ఏది ఏమైనా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుగానీ, లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణగానీ తమ మాటల్లో పదే పదే పవన్ కళ్యాణ్‌ను ప్రస్తావించటానికి, అతని మద్దతుకోసం ప్రయత్నించటానికి కారణం అతనిమీద ప్రేమకాదని, యూత్‌లోనూ, అతని సామాజికవర్గంలోనూ ఉన్న ఫాలోయింగేనన్నది తెలిసిన విషయమే. దానికితోడు జూనియర్ ఎన్‌టీఆర్ లేని లోటును పవన్‌ద్వారా అధిగమించాలని చంద్రబాబు ప్రయాస పడుతున్నారు. తన మిత్రుడు పొట్లూరి వరప్రసాద్‌కు విజయవాడ టికెట్ ఇవ్వలేదని చంద్రబాబుపై గుర్రుగా ఉన్న పవన్, మొత్తానికి నిన్నటిభేటీ తర్వాత మెత్తబడ్డట్టే ఉన్నారు. రేపటినుంచి టీడీపీ, బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఇవాళ ప్రకటన విడుదలచేశారు. పవన్ మద్దతువలన ఫలితాలు గణనీయంగా మారతాయని చెప్పలేముగానీ, తెలుగుదేశానికి ఎంతోకొంత లబ్దికలుగుతుందనిమాత్రం చెప్పొచ్చు.

Comments

Popular posts from this blog

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

ఏపీలో ఏ వర్గం ఓట్లు ఎటువైపు? తటస్థ ఓటర్ల మద్దతు జగన్‌కా, కూటమికా?

  ఏపీలో సంఖ్యాపరంగా అతి పెద్ద వర్గం బీసీలు. వివిధ రాజకీయపార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తుంటాయిగానీ, రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీ మాలలవంటి కులాలలాగా బీసీలు గంపగుత్తగా ఒకవైపు ఓట్లు వేయటం జరగదు. ఎందుకంటే బీసీలు అంటే యాదవ, గౌడ, శెట్టిబలిజ, పద్మశాలి, మత్స్యకార వంటి అనేక వెనుకబడిన కులాల సమాహారం. రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీలలాగా బీసీలను ఒక్కటిగా కనెక్ట్ చేసే యూనిఫికేషన్ ఫ్యాక్టర్ ఏదీ ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. బీసీలపై ప్రేమ వలనో, వారి ఓట్లపై ప్రేమవలనోగానీ, జగన్మోహన్ రెడ్డి వారికి ఈ ఎన్నికల్లో వారికి పెద్దపీట వేశాడు. కొన్నిచోట్ల తన కులాభిమానాన్ని కూడా పక్కనపెట్టి రెడ్లుకు కాకుండా బీసీలకు టిక్కెట్లు ఇచ్చాడు... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని...