ఒకనాడు ద్విథృవంగా(అమెరికా, రష్యా)ఉన్న ప్రపంచం, సోవియట్ రష్యా(యూఎస్ఎస్ఆర్) పతనం పుణ్యమా అని ఏకధృవప్రపంచమైపోవడంతో పెద్దన్నపాత్ర తీసుకున్న అమెరికా...గత 30ఏళ్ళుగా చేస్తూవస్తున్న కర్రపెత్తనానికి కాలం చెల్లే పరిస్థితి దగ్గరకు వచ్చినట్లేఉంది. అమెరికా ఆధిపత్యం సడలిందని ఆ దేశ అధ్యక్షుడే స్వయంగా అంగీకరించారు. అఫ్ కోర్స్...ఆయన చెప్పింది ఆర్ధికపరంగా అనుకోండి.(డబ్బు లేకపోతే ఎవరు లెక్క చేస్తారు?) భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు అనూహ్యరీతిలో ఎదుగుతుండటం తమ ఆర్ధికవ్యవస్థకు సవాలుగా మారిందని ఒబామా నిన్న ముంబాయిలో చెప్పారు. అయితే ఆ దేశాలకు గట్టిపోటీనిస్తామని గాంభీర్యం ప్రదర్శించారు. భారత్ కు హైటెక్ ఎగుమతులపై ఆంక్షలు తొలగించడంపై తనకు, తన ప్రజలకు సర్ది చెప్పుకున్నారు. వాణిజ్యమంటే ఒక్కవైపునుంచే జరగదని, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని అన్నారు. మధ్యంతర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అమెరికా ప్రజలకు ఆయన ఈ వివరణ ఇచ్చుకున్నట్లు కనబడుతోంది.
భారత్ ఎదుగుతున్న శక్తి కాదని, ఇప్పుడది అంతర్జాతీయశక్తి అని ఒబామా అన్నారు. ఇవాళ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ను సందర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ తో స్నేహసంబంధాలను మరింత పటిష్ఠం చేసుకోవడంకోసమే తానీ యాత్రను చేపట్టినట్లు చెప్పారు. పాకిస్తాన్ గురించి మాత్రం ఒబామా ఆచితూచి మాట్లాడారు. మొన్న ముంబాయిదాడుల మృతులకు నివాళులర్పించే సమయంలో కూడా ఆ దాడుల్లో పాకిస్తాన్ తీవ్రవాదుల పాత్రను ఒబామా ప్రస్తావించలేదు. నిన్న కూడా సెయింట్ జేవియర్స్ కళాశాలలో ఓ విద్యార్ధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... పాకిస్తాన్ ఆసియాలో ఓ కీలక దేశమని, దాని ప్రాధాన్యతను ఎవరూ విస్మరించలేరని అన్నారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదశక్తులు ఉన్నమాట నిజమేనని, అలాంటివి అన్ని దేశాల్లో ఉన్నాయని చెప్పారు. అయితే తీవ్రవాదంపై పాకిస్తాన్ ప్రభుత్వం పోరు ఆశించిన స్థాయిలో లేనిమాట నిజమేనని అన్నారు. పాకిస్తాన్ బాగుంటేనే భారత్ కు మంచిదని, ఇరుదేశాలూ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
ఏది ఏమైనా ట్విన్ టవర్స్ పై అల్ ఖైదా దాడులు, కుంభకోణాలు, ఆర్ధికవ్యవస్థ పతనం, నిరుద్యోగం వంటి వరుసదెబ్బలతో కుదేలైపోతున్న అమెరికా పరిస్థితి క్రమక్రమేణా దిగజారి, ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యంగా ఉన్న బ్రిటన్...ఎలాగైతే మామూలు దేశంగా మారిపోయిందో అమెరికా కూడా అలాగే మారే పరిస్థితి దగ్గర్లేనో ఉందని అనిపిస్తోంది.
Comments
Post a Comment