Skip to main content

ఆంధ్రా కేజ్రీవాల్ అవ్వాలనుకుంటున్న శివాజికి విశాఖలో చేదు అనుభవం


ఏదో ఒక సమస్య తీసుకుని ప్రజా ఉద్యమాలు నడిపి అర్జెంట్‌గా ఏపీలో అగ్రనేతగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్న నటుడు శివాజికి దురదృష్టవశాత్తూ నిన్న విశాఖపట్నంలో చుక్కెదురయింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాకోసం శివాజీ ఇటీవల ఉద్యమం ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రం నలువైపులా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతిలో మొదటి సమావేశం నిర్వహించారుకూడా. గురువారం విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీలోని ప్లాటినంజుబ్లీ హాల్‌లో ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సమావేశంలో మాట్లాడుతూ కొందరు వక్తలు బీజేపీ, టీడీపీ పార్టీలను విమర్శించినపుడు శివాజీ వారిని అడ్డుకుని మైక్ కట్ చేశారు. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ వక్తలను శివాజి అనుచరులు అడ్డుకోవటానికి ప్రయత్నించటంతో  అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అసంతృప్తికి గురైన శివాజి, ఇలా అయితే వెళ్ళిపోతానంటూ తన అనుచరులతోసహా అక్కడనుంచి కారులో ఉడాయించారు. ఓర్పు, సహనంలేని శివాజికి రాజకీయాలు ఎందుకంటూ సమావేశానికి హాజరైన విద్యార్థులు, ఉద్యమకారులు హీరోగారిని తీవ్రంగా దుర్భాషలాడారు. ఈ సమావేశంతాలూకు వీడియోను ఇక్కడ చూడొచ్చు.

'మాస్టర్' చిత్రంతో సినీరంగప్రవేశం చేసిన శివాజి, గుంటూరుజిల్లా నర్సరావుపేటప్రాంతానికి చెందిన సామాన్యకుటుంబంనుంచి వచ్చారు. హైదరాబాద్‌లో జెమిని టీవీ ఛానల్‌లో మొదట చిన్నఉద్యోగం చేసేవారు. ఒకరోజు పాటల ప్రోగ్రామ్‌కు యాంకర్ రాకపోవటంతో మంచి మాటకారి అయిన శివాజినే ఆ ప్రోగ్రామ్ నిర్వాహకులు యాంకర్‌ను చేసేశారు. ఆ తర్వాత దర్శకుడు రాఘవేంద్రరావు 2000 సంవత్సరంలో కొత్త నటీనటులకోసం నిర్వహించిన పోటీలో సెలక్ట్ అయ్యారు. 'పరదేశి' అనే సినిమాలో అవకాశం సంపాదించుకుని 'మాస్టర్' చిత్రంద్వారా వెలుగులోకి వచ్చారు. హీరో స్నేహితుడి వేషాలు వేస్తూ ఉండే శివాజి మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం వంటి చిత్రాలద్వారా హీరోగా ఓ వెలుగు వెలిగారు. మాస్ హీరోగా ఎదగాలని స్టేట్ రౌడీ, సీతారాముడు అనే కొన్ని చిత్రాలు తీయగా అవి వారంకూడా ఆడలేదు. ఆ దెబ్బతో చిన్న సినిమాల ఆఫర్‌లు కూడా పోయాయి. ఇటీవల అవకాశాలు లేకపోవటంతో తనే స్వంతంగా 'బూచమ్మ బూచాడు' అనే కామెడీ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించారు. అది ఓ మాదిరిగా నడిచింది.

టీవీ9 ఎడిటర్ రవిప్రకాష్‌తో సాన్నిహిత్యం కలిగిఉన్న శివాజీ, ఆ ఛానల్ మద్దతుతో ఉద్యమ మార్గాన్ని ఎంచుకున్నారు. ఏదో ఒక సమస్య తీసుకుని రోడ్డెక్కుతున్నారు. ఆ కార్యక్రమాలన్నింటినీ టీవీ9 అత్యంత ప్రాధాన్యత ఇచ్చి చూపిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని పాలెంవద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాదం బాధితుల సమస్యతో ఉద్యమాల బాటలో బయలుదేరారు. ఆ తర్వాత, తిరుమలలో దేవస్థానం బోర్డ్ ధనికులకు ఊడిగం చేస్తోందంటూ హైదరాబాద్‌లో ఒకరోజు ధర్నా చేశారు(టీటీడీ బోర్డ్ ఛైర్మన్ కావాలన్నది తన కోరికలలో ఒకటని ఈయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కేలో వాక్రుచ్చారు). రోడ్డుప్రమాదాలు ఎక్కువైపోతున్నాయంటూ కొన్నిరోజులు ఆక్రోశం వెలిబుచ్చారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాకోసం గళమెత్తారు. అన్నిపార్టీలూ కలిసి ఏపీని తొక్కేస్తున్నాయని, దీనికోసం ఉద్యమించాలని నినదించారు. అంతర్యుద్ధం తప్పదని ప్రభుత్వాలను హెచ్చరించారు.

లక్ష్యం స్వార్థపూరితమైనప్పటికీ ఆ ప్రయత్నంలో శివాజి మరింత శ్రద్ధ, కృషి పెడితే బాగుండేది. ఏదో ఒక సమస్యతో టీవీ ఛానల్‌లో కనిపించాలనికాకుండా, చిత్తశుద్ధితో ఏదో ఒకటి నిర్మాణాత్మకంగా చేయాలి. ఆ సమస్యను సమూలంగా అధ్యయనం చేయాలి. శివాజి సభలలో మాట్లాడే మాటలు చూస్తే పరిణతితోకూడినవిగాలేకపోగా చిన్నపిల్లలు మాట్లాడినట్లు ఉన్నాయి. షార్ట్‌కట్‌లద్వారా తొందరగా పైకి ఎగబాకాలనికాక ప్రణాళికాబద్ధంగా నిర్మాణాత్మకంగా శివాజి కృషిచేస్తే బాగుంటుంది.



Image courtesy:fb.com/ActorSivaji

Comments

  1. ఆంద్ర కేజ్రీవాల్ స్వ. ఎంఎస్ నారాయణ గారండీ బాబూ. శివాజీ & లోక్సత్తా నారాయణ రాజకీయాలలో ఎంఎస్ నారాయణ లాంటి వాళ్ళు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.