Skip to main content

జూ.ఎన్‌టీఆర్‌ ఫెయిల్యూర్ ఫార్ములా



'రామయ్యా వస్తావయ్యా' ఓవర్సీస్ లో అతిపెద్ద ఫ్లాప్ గా రికార్డ్ సృష్టించిందని తెలుగు సినిమా వెబ్ సైట్లు కోడై కూస్తున్నాయి. అదెంత నిజమోగానీ తెలుగు ఇండస్ట్రీలో మంచి ట్యాలెంట్, మాస్ అప్పీల్ ఉన్న జూ.ఎన్‌టీఆర్‌కు ఆది, సింహాద్రి స్థాయి ఘనవిజయం అందకుండా ఊరిస్తోందన్నది నిజం. యమదొంగ, బృందావనం, అదుర్స్ వంటివి విజయం సాధించినా అవి బ్లాక్ బస్టర్ హిట్స్ కాదన్నది అందరికీ తెలిసిన విషయమే. రామయ్యా వస్తావయ్యాకు ముందు వచ్చిన బాద్షా రు.40 కోట్లు వసూలుచేసిందని చెబుతున్నప్పటికీ, పెట్టుబడి పెట్టినవారెవరికీ లాభాలు రాలేదన్న సంగతి విదితమే. ఇక జూనియర్ ఫ్లాప్ లను ఒకసారి చూస్తే, ఇంత భారీ ఫ్లాపులు ప్రస్తుతమున్న హీరోలలో మరెవరికీ లేవనే చెప్పాలి. నరసింహుడు ఫ్లాపవడంతో ఆ సినిమా నిర్మాత చెంగల వెంకట్రావు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో దూకితే, పెద్ద ఎన్టీయార్, చిరంజీవిలతో ఎన్నో సూపర్ హిట్లిచ్చిన సుప్రసిద్ధ నిర్మాత చలసాని అశ్వనీదత్, శక్తి సినిమా ఫ్లాప్ అవటంతో ఉంటున్న ఇల్లుకూడా అమ్ముకున్నాడని ఫిలింనగర్ లో చెప్పుకుంటుంటారు.

ఈ స్థితికి కారణమెవరని ప్రశ్నిస్తే, జూనియర్ స్వయంకృతాపరాధమని చెప్పక తప్పదు. ముఖ్యంగా దర్శకుల ఎంపికలో, కథల ఎంపికలో జూనియర్ అనుసరిస్తున్న విధానమేఈ పరిస్థితికి కారణం. ఏదైనా సినిమా బంపర్ హిట్ అవగానే, ఆ సినిమాలాంటి కథో, కాన్సెప్టో, పాటలో కావాలని జూనియర్ పట్టుబడతాడని ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ బాహాటంగానే చెబుతుంటారు. పోకిరి హిట్ అవ్వగానే, ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మెహర్ రమేష్ తో అదే ఛాయలున్న కథతో, మహేష్ తరహా డైలాగ్ డెలివరీతో కంత్రీ సినిమాను చేశాడు.అది సోసోగా నడిచింది. మగధీర హిట్ అవ్వగానే అలాంటి హిట్టే కావాలని రాజమౌళిని అడిగినా, అతను ఒప్పుకోకపోవటంతో మళ్ళీ మెహర్ రమేష్ తోనే అదే తరహా కథతో 'శక్తి' చేశాడు. దూకుడు హిట్ అవ్వగానే ఆ దర్శకుడు శ్రీను వైట్లతోనే 'బాద్షా' చేశాడుఈ మధ్యలో సురేంద్రరెడ్డి తన సోదరుడు కళ్యాణ్ రామ్ కు అతనొక్కడే వంటి హిట్ ఇవ్వగానే అశోక్ ను, రవితేజకు కిక్ వంటి హిట్ ఇవ్వగానే ఊసరవెల్లిని చేశాడు. బాబాయ్ బాలయ్యతో సింహా వంటి సూపర్ హిట్ చేసిన బోయపాటితో తీసినదమ్ము కూడా పెద్దగా దుమ్ములేపలేకపోయింది. తాజా చిత్రం రామయ్యా వస్తావయ్యాలో జూనియర్ పాత్ర 'సీతమ్మ వాకిట్లో...'లో మహేష్ క్యారెక్టర్ లాగా నలుగురు కుర్రాళ్ళను వెంటేసుకుని తిరుగుతూ ఉండటం గమనార్హం.

జూనియర్ కు ప్రధానమైన లోపం మంచి సలహాబృందం లేకపోవటం. ఆహా, ఓహో అనే భజన బృందంవలన ఈగో తృప్తి పడుతుందేమోగానీ, సక్సెస్ ఫార్ములా అంతుపట్టదని జూనియర్ ఇకనైనా తెలుసుకోవాలి. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి టైపులో ప్రతి సినిమాలో తాత గురించి, వంశం గురించి, రికార్డులగురించి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటాన్ని జూనియర్ ఆపాలి. ట్రెండ్ ను అనుసరించటం కాకుండా ట్రెండ్ సృష్టించేవిధంగా ఆలోచిస్తేనే ఎన్టీయార్ కు బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్ళలోనే స్టూడెంట్ నం.1,ఆది, సింహాద్రి వంటి ఘనవిజయాలను ఇచ్చి, నాటి నంబర్ ఒన్ చిరంజీవికి పోటీ అవుతాడా అనిపించిన జూనియర్ ఇప్పుడు మూడవస్థానంలో ఉన్నాడన్నది ఎవరూ కాదనలేరు(నంబర్ వన్ స్థానంకోసం పోటీ పవన్ కళ్యాణ్, మహేష్ లమధ్యే ఉంది). పూర్వ ప్రాభవాన్ని తిరిగి పొందాలంటే జూనియర్ తన ఫార్ములాను మార్చితీరాలి.


కొసమెరుపు: ఇప్పుడు అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్ అయిందికాబట్టి, అర్జంటుగా అత్త, అల్లుడు స్టోరీతో ఒక సినిమా చేసి తీరాల్సిందేనని త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంటపడతాడేమో మన యంగ్ టైగర్!


Image courtesy:wikipedia 



Comments

  1. i think ntr is 4 after prabhas

    ReplyDelete
  2. ఈ రోజుల్లో ప్రేక్షకులకి వినోదం కావాలి కాని ఫైట్లు, సెట్టింగులు అక్కర్లేదని ఎప్పుడు తెలుసుకుంటారో ఈ సినిమా జనాలు?

    ReplyDelete
  3. సినిమా కథలో సత్తా,దర్శకుడికి విజన్,కథనంలో కొత్తదనం ఉంటేనే విజయం వరిస్తుంది,కాని ఒక హిట్టిచ్చిన దర్శకుడు వెనువెంటనే మరో హిట్టివ్వడం కష్టం!ఎందుకంటే అతను ఆ సినిమాకు ఖర్చుపెట్టిన సృజనశక్తిని వెంటనే ని౦పుకోలేడు! కొంత వ్యవధి తప్పక అవసరం!చిన్న ఎన్టిఆర్ ఒక మంచి సలహాదారుడిని నియమించుకొని ఆయన చెప్పిన సినిమాలు మాత్రమే సైన్ చేయడం మంచిది!సినిమాల స్వయం నిర్ణయంలో ఎందుకో కాని తూకం తప్పుతోంది మరి !

    ReplyDelete
  4. How much in the above words i don't know but no body is ready to get failures wantedly :) , hope he is failing to choose the right script, thats it :)

    ReplyDelete
    Replies
    1. How much truth is there in your words i don't know but no body is ready to get failures wantedly :) , hope he is failing to choose the right script, thats it :)

      Delete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర